Newspaper Banner
Date of Publish : 12 November 2025, 2:26 pm Editor : REPUBLIC HINDUSTAN

ఢిల్లీ మానవ బాంబర్‌కు రెండో కారు!

Advertisement
- ఎర్ర రంగు ఎకోస్పోర్ట్ కోసం పోలీసుల గాలింపు
- నకిలీ చిరునామాతో కారు రిజిస్ట్రేషన్‌
- ఎర్రకోట పేలుడులో రెండో వాహనం అనుమానం

(న్యూఢిల్లీ, నవంబర్ 12) : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎర్రకోట పేలుడు కేసులో కొత్త వివరాలు వెలుగుచూశాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మానవ బాంబు అనుమానితుడు డాక్టర్ ఉమర్ నబీ మరో కారు యజమానిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈసారి ఆ కారు ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అని తేలింది. ఈ వాహనం కోసం ఢిల్లీ పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.
- దర్యాప్తులో కొత్త ఆధారాలు బయటకు
సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలోని మెట్రో గేట్ 1 వద్ద జరిగిన కారు పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఉమర్ నబీ అని పోలీసులు నిర్ధారించారు. పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారుతో పాటు, ఉమర్ నబీ రెండో వాహనంగా ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌ను కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
- నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్‌
డీఎల్‌ 10 సీకే 0458 నంబర్‌ కలిగిన ఈ ఎకోస్పోర్ట్ కారు 2017 నవంబర్‌ 22న ఢిల్లీలోని రాజౌరి గార్డెన్‌ ఆర్డీవో కార్యాలయంలో రిజిస్టర్‌ చేయబడింది. ఆ వాహనం రెండో యజమానిగా డాక్టర్‌ ఉమర్‌ మొహమ్మద్‌ అలియాస్‌ ఉమర్‌ ఉన్‌ నబీ పేరుతో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఈ కారును రిజిస్టర్‌ చేయడానికి ఆయన ఈశాన్య ఢిల్లీలో నకిలీ చిరునామాను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
- రెండో వాహనం ఆపరేషన్‌లో కీలకం
ఎర్రకోట పేలుడు ఆపరేషన్‌లో ఈ ఎకోస్పోర్ట్‌ రెండో వాహనంగా వినియోగించబడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లోని పోలీసు బృందాలు ఈ వాహనాన్ని గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టాయి. బాంబ్‌ దాడి వెనుక ఉన్న పూర్తి మాడ్యూల్‌ వివరాలు వెలుగులోకి తెచ్చే దిశగా అధికారులు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this article:

WhatsApp Facebook Twitter Telegram LinkedIn